మూడు టెల్కోలకు ప్రభుత్వ ప్రోత్సాహకం

ముంబై: దేశంలోని టెలికం రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ తక్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం తక్కర్ మీడియాతో మాట్లాడుతూ మూడు టెల్కోలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఏజీఆర్పై(సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారిందని అన్నారు. టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏజీఆర్ విషయమై కోర్టులో రివ్యూ పిటిషన్ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోందని అన్నారు.
కాగా టెలికం రంగానికి సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సులు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే తాము ఏ బ్యాంక్లకు బకాయిలు లేమని తక్కర్ స్పష్టం చేశారు. ఫోర్ ప్రైసింగ్కు సంబంధించి ప్రభుత్వం సమీక్షించి, టెలికం రంగాన్ని ఆదుకోవాలని కోరారు.
ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. కాగా ఇంత వరకు ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఏజీఆర్లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి