ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాను

– అభిషేక్ నామా
సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకద్వయం సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూడగానే కనెక్ట్ అయ్యాను. కొడుకు విదేశాలకు వెళితే ఒక తండ్రి ఎంతగా తల్లడిల్లిపోతాడో ఈ సినిమాలో చూపించారు.
సుజోయ్, సునీల్ ఈ సినిమా బాగా తీశారు. ఒక సినిమా రిలీజ్కు ఎప్పుడూ పడనంత ప్రెజర్ ఈ సినిమాకు పడ్డాను. మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోదం, సందేశం మేళవించిన చిత్రం ఇది. పాటలు, రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘ఇది న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల అనుబంధం, పిల్లలు వేరే దేశంలో ఉంటే కుటుంబంపై, సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా ప్రధానాంశం.
డైరెక్షన్ ఫస్ట్ టైమ్ అయినా ఎక్కడా రాజీ పడలేదు’’ అన్నారు సుజోయ్.‘‘కథ చెప్పగానే నిర్మాణంలో భాగస్వామిగా ఉండటానికి అప్పిరెడ్డి ముందుకొచ్చారు. అభిషేక్ నామాగారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీరిద్దరికీ థ్యాంక్స్. హైదరాబాద్ వాడుక భాషలో ఉండే సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు సుశీల్. ‘‘ఇంతకుముందు అమెరికా నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మా సినిమా విభిన్నంగా ఉంటుంది. కుటుంబ విలువలు ఉన్న సినిమా. ముగ్గురు స్నేహితులు కలిసి చేసే అల్లరి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సాయి రోనక్. నటుడు రాజై రోవన్, రచయిత శ్యామ్ జడల, మార్కెటింగ్ ప్రమోటర్ అభితేజ తదితరులు మాట్లాడారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి