మీరు ఎమ్మెల్సీనా..?

Toll Plaza Questioned MLC Alugubelli Narsi Reddy  - Sakshi

మీ వాహనంలో గన్‌మన్లే లేరు.. ఎలా నమ్మాలి?

నర్సిరెడ్డి వాహనాన్ని ఆపి టోల్‌ఫీజు అడిగిన సిబ్బంది

పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ నిరసన

సాక్షి, చౌటుప్పల్‌: ‘మీ వాహనంలో గన్‌మన్లు లేరు. మీరు ఎమ్మెల్సీ అంటే నమ్మేదెలా?’ అంటూ టోల్‌ప్లాజా సిబ్బంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని ప్రశ్నించారు. దీనికి నిరసనగా ఆయన టోల్‌ప్లాజా వద్ద బైఠాయించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఉదయం తన సొంత వాహనంలో నల్లగొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజాలోని రుసుము చెల్లింపు కౌంటర్‌ నుంచి వాహనం వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్సీనని, వాహనాన్ని పంపించాలని కోరారు. వాహనంలో గన్‌మన్లు లేకపోవడంతో మీరు ఎమ్మెల్సీ అంటే ఎలా నమ్మాలి అని టోల్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తన వద్ద ఉన్న ఐడీ కార్డును చూపించారు.

ఆ ఐడీ కార్డును కంప్యూటర్‌లో పరిశీలించగా అందులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేరు నమోదు కాకపోవడంతో వాహనాన్ని పం పించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన వాహనం దిగి టోల్‌బూత్‌ల ముందు బైఠాయించా రు. విషయం తెలుసుకున్న పోలీసులు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. తాను పోలీస్‌ గన్‌మన్లను తీసుకోలేదని, దీనిపై టోల్‌ నిర్వాహకులకు సమాచారం ఇచ్చానన్నారు. అయితే ఇటుగా ప్రయాణం చేసిన ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న టోల్‌ప్లాజా ఉన్నతాధికారులు ఎమ్మెల్సీని పంపించారు. వాహనంలో గన్‌మన్లు లేకపోవడంతో సిబ్బంది ఆయనను గుర్తించలేకపోయారని జీఎమ్మార్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఫ్రీ ఫాస్టాగ్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అది వస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top